రామాబాణంతో ఏర్పడిన జలధార

రంగారెడ్డి జిల్లాలోని తాండూరు మండలం జుంటుపల్లిలో కొలువైన శ్రీరామస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 600 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. గోల్కొండ నవాబుల కాలంలో కృష్ణవదన్ రావు, శ్యామారావు సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. గండిపేట ప్రాంతానికి చెందిన వీరు జుంటుపల్లి పరిసరాల్లో వైరాగుల వలె పర్యటిస్తున్నారట. ఆ సమయంలో అక్కడ గల కోనేరులో శ్రీరాముని విగ్రహ శిలాఫలకం దొరికిందట. ఆ తర్వాత రాముడు వీరి కలలో ఆలయ నిర్మాణం చేయాలని ఆదేశించాడని ఇక్కడి స్థలపురాణం.

అలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ గల శ్రీరాముని విగ్రహం నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తుంది. గుట్టపై,  400 అడుగుల ఎత్తులో  గల  విగ్రహం నుంచి నీరు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా మంది ఈ రహస్యాన్ని పరిశోధించేందుకు ప్రయత్నించినా ఆ విషయం తెలియలేదు. మానవునికి అంతుచిక్కని మహిమలు నేటికీ ఎన్నో వున్నాయని అంగీకరించవలసిందే.
ఈ ప్రాంతంలో ఉన్న మరో గుట్టపై ఏడాది పొడుగునా నీరు ఉండే చోటు వుంది. ఈ నీటి దొన గురించి ఓ కథ ప్రచారంలో వుంది. శ్రీ సీతారాములు వనవాస కాలంలో  ఈ ప్రాంతానికి వచ్చారని, అప్పుడు కొండ పై భాగాన వున్నప్పుడూ వారికి నీరు కావలసి వచ్చిందని, ఆ సమయంలో రాముడు ఆ బండరాతిపై బాణాన్ని ప్రయోగించి, శిలను చీల్చి నీటిని రప్పించాడని చెబుతుంటారు. అలాగే ఇక్కడే సీతమ్మ దొన కూడా వుంది. ఈ రెండిటినీ కలిపి గాడిదొనలు అంటారు. ఈ నీటిలో స్నానం చేయటం వలన దోషాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.

ఆలయంలో ఏటా నిర్వహించే జాతరలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. సమీపంలోనే భీమా నది ఉపనది అయిన కగ్నా నదిపై జుంటుపల్లి నీటి పారుదల ప్రాజెక్టు కూడా ఉంది. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు సెలవు దినాల్లో ఇక్కడికి విహారానికి వస్తుంటారు.

No comments:

Post a Comment