జగన్మోహిని పుట్టుమచ్చ రహస్యం

దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే.,అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపందాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై..కనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ.., అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.


ఈ విషయాన్ని కలహభోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు. అప్పుడు పరమశివుడు ‘మనోనిగ్రహం లేని మీవంటివారు విష్ణుమాయా విలాసానికి లోనౌతారుగానీ నావంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచించలేదు’ అన్నాడు. అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి ‘నీ జగన్మోహన రూపాన్ని చూపించు’ అని అడిగాడు.  పరమేశ్వరుడు అడిగితే పరంథాముడు కాదనగలడా. మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి.. విరాగి, శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై..తనను తానే మరచి ఆ జగన్మోహిని వెంటబడ్డాడు. జగన్మోహిని శివుని చేతికి చిక్కక..చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకం వచ్చి ఆగి శిలారూపం దాల్చింది. అదే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటకు పది మైళ్ల దూరంలో గల ‘ర్యాలి’ అనే గ్రామంలో ఉన్న ‘జగన్మోహినీ కేశవస్వామి’ దేవాలయం.

పూర్వం ‘ర్యాలి’ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను ‘ఘంటచోళుడు’ అనే చక్రవర్తి పరిపాలిస్తూండేవాడు. ఒకసారి ‘ఘంటచోళుడు’ వేటకని ఆ అరణ్యాలకు వచ్చి, చాలాసేపు వేటాడి, అలిసిపోయి ఒక చెట్టునీడన విశ్రమించాడు. ఎందరో భక్తులు హరిసంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపించాయి. చక్రవర్తి కన్నులు తెరిచి చూసాడు. ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయిన ‘ఘంటచోళుడు’ వేట చాలించి రాజథానికి వచ్చాడు. ఆ రాత్రి ‘ఘంటచోళుని’ కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి ‘రాజా..ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు. ఆ రథం శీల ఎక్కడ ఊడి పడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు. నీ జన్మ ధన్యమౌతుంది’ అని ఆదేశించాడు. నిద్రనుంచి మేల్కొన్న మహారాజు మరునాడు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి, వారి ఆదేశంతో రథాన్ని నడిపించాడు. ఒకచోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా ‘జగన్మోహిని’ విగ్రహం బయటపడింది. మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహానికి ఒకప్రక్కన శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే... మరొకప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది. స్త్రీ పుంభావ రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు ‘ఘంటచోళ చక్రవర్తి’. ఆ తరువాతి కాలంలో ఆ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. అదే  ప్రస్తుతం ‘ర్యాలి’ గ్రామంలోనున్న ‘జగన్మోహిని కేశవస్వామి’ దేవాలయం.

ఈ ఆలయానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంది. అదే.. నాడు జగన్మోహిని వెంట పరుగులు తీస్తూవచ్చిన పరమశివుని ఆలయం. ఆ స్వామిని ‘ఉమాకమండలీశ్వరుడు’ అని అంటారు. శిల్పకళాచార్యుల ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం ‘జగన్మోహినీ కేశవస్వామి’ దేవాలయం. సుమారు ఐదడుగుల ఎత్తు ఉన్న నల్లటిశిలలో నయన మనోహరంగా ఉండే ‘కేశవస్వామి’ ఒకప్రక్క..భక్తుల హృదయాలను దోచుకునే రూపంతో ‘జగన్మోహిని’గా మరొకప్రక్క.. అందరినీ ఆకర్షించే ఆ నల్లని ఏకశిలా మూలవిరాట్టులో.., భక్తుని ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. ఇదే ఆ సుందర,సుకుమార ‘జగన్మోహినీ కేశవస్వామి’ శిల్పకళా వైభవ ప్రత్యేకత. అంతేకాదు.. పద్మినీజాతి స్త్రీకి వెనుకవైపున సహజంగా ఉండే పుట్టుమచ్చ ఈ ‘జగన్మోహిని’ శిల్పానికి వెనుక భాగంలో ఉండి, భక్తులకు చక్కగా కనబడడం ఈ శిల్పం ప్రత్యేకత. విశ్వసృష్టికి మూలభూతమైన స్త్రీ, పుంసాత్మకమైన ఈ ‘జగన్మోహిని’కి మన ఆంధ్రదేశంలో తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడ దేవాలయం లేదు. ఈ ‘జగన్మోహిని’ శిరో భూషణాలు, శరీర అలంకారాలు, ముఖ సౌందర్యం వర్ణనాతీతం. ఇక ‘కేశవస్వామి’ అరచేతిలోని రేఖలు, కంఠసీమ మీది మడతలు.,నాలుగు చేతులలోని శంఖ,, చక్ర, గదా, పద్మాలు ఆనాటి శిల్పుల కళాచాతుర్యానికి తార్కాణాలు. ఆ ‘కేశవస్వామి’ పాద పద్మాలనుంచి నిరంతరం ఉద్భవించు ‘జలం’ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ స్వామి పాదోద్భవ జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. పండుగల్లోను, పర్వదినాల్లోను ఈ స్వామికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ మూర్తి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా దర్శించి తీరాలి. అలా చూడలేనివారు కళ్లుండి కూడా గ్రుడ్డివారే .. అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

No comments:

Post a Comment